బంజారాహిల్స్ : ఆస్తికోసం కన్నతల్లిని వేధింపులకు గురిచేస్తుండడంతో పాటు ఇంట్లోంచి బయటకు గెంటేసేందుకు యత్నిస్తున్న కొడుకుతో పాటు అతడు సహజీవనం చేస్తున్న యువతిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బర్కత్పురకు చెందిన బి.హేమలత(65) అనే వృద్ధురాలికి కొడుకు శ్రీకాంత్ ఉన్నాడు. మూడేళ్లుగా సింధూరరెడ్డి అనే యువతితో శ్రీకాంత్ సహజీవనం చేస్తూ బంజారాహిల్స్ రోడ్ నెం 14లో నివాసం ఉంటున్నాడు.
హేమలతకు మీర్పేటలో ఉన్న ఇంటిని కొడుకు శ్రీకాంత్, సింధూరరెడ్డి కలిసి బలవంతంగా అమ్మించారు. వచ్చిన డబ్బులు తీసుకున్న కొడుకు తల్లి హేమలతను బాగా చూసుకుంటానని నమ్మించి ఆరునెలల క్రితం బంజారాహిల్స్లోని తన ఇంటికి తీసుకువచ్చాడు. అప్పటినుంచి కొడుకు ఇంట్లోనే ఉంటున్న హేమలతను సింధూరరెడ్డి తీవ్రంగా దూషించ డంతో పాటు ఇబ్బందులకు గురిచేస్తోంది.
కొడుకు శ్రీకాంత్ కూడా తల్లిని వేధింపులకు గురిచేయడంతో పాటు ఇంట్లోంచి తరిమివేశారంటూ బాధితురాలు హేమలత బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ మేరకు శ్రీకాంత్తో పాటు సింధూరరెడ్డి మీద కేసు నమోదు చేశారు.