ముంబై: అత్యాచార బాధితురాలికి జన్మించిన ఆడబిడ్డను గుట్టుచప్పుడు కాకుండా అమ్మేసే ప్రయత్నం చేసిన 13 మందిపై పోలీసులు కేసులు నమోదుచేశారు. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కొన్ని నెలల క్రితం ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడటంతో సతారా జిల్లాకు చెందిన ఓ 15 ఏండ్ల బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం బాలిక కుటుంబసభ్యులకు తెలియడంతో అబార్షన్ చేయించాలని చూశారు. కానీ అప్పటికే అబార్షన్ చేయాల్సిన సమయం దాటిపోవడంతో బాధ్యులెవరని బాలికను నిలదీశారు.
దాంతో తనపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు యువకుల పేర్లను బాలిక వెల్లడించింది. దాంతో కుటుంబసభ్యులు ఆ ఇద్దరు యువకులకు విషయం తెలియజేసి పంచాయితీ పెట్టారు. ఈ సందర్భంగా నిందితులిద్దరూ.. బాధితురాలు బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆ బిడ్డను ఎక్కడైనా వదిలేసే బాధ్యత తమదని ఒప్పుకున్నారు. ఈ క్రమంలో తాజాగా బాధితురాలు ఆడపిల్లకు జన్మనిచ్చింది. ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం.. నిందితులు బాధితురాలి బిడ్డను ముంబైకి చెందిన దంపతులకు ఇచ్చే ప్రయత్నం చేశారు.
అయితే, ఆలస్యంగా ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. బాలికపై అత్యాచారానికి పాల్పడటమేగాక, ఆమె కన్నబిడ్డను చట్టబద్ధమైన ప్రక్రియను పాటించకుండా ఇతరులకు ఇచ్చే ప్రయత్నం చేసిన నిందితులిద్దరిని అరెస్ట్ చేశారు. అదేవిధంగా ఈ ఘటనలో ప్రమేయం ఉన్న మరో 11 మందిపై కేసులు నమోదుచేశారు. వారిలో అత్యాచార బాధితురాలి కుటుంబానికి చెందిన ఒక సభ్యుడు కూడా ఉన్నారు.