శంకర్పల్లి : ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి శంకర్పల్లి మండలంలోని కొత్తపల్లి గ్రామ శివారులో ఉన్న వాగులో ప్రమాదవశాత్తు కారు కొట్టుకుపోయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల మండలం కౌకుంట్ల గ్రామానికి చెందిన ఐదుగురు కారులో ఎనికెపల్లికి పని నిమిత్తం వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నారు. కొత్తపల్లి గ్రామం వద్దకు రాగానే భారీ వర్షానికి వాగు ఉధృతంగా పారుతుండడంతో కొద్దిసేపు ఆగి వాగు దాటుతుండగా వాగు మధ్యలోకి వెళ్లేసరికి కారు ఆగిపోయింది. నీటి ప్రవాహానికి కారు వాగులో కొట్టుకుపోవడంతో అందులో ఉన్న సాయి, వినోద్, రమేశ్, శ్రీనివాస్ కారులో నుంచి కిందికి దూకి ప్రాణాలతో బయటపడ్డారు. మరో వ్యక్తి వెంకటయ్య మాత్రం వాగులో గల్లంతయ్యాడు. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.