‘ నేను మీకు దొరకను..నాకు నేనుగా లొంగిపోతేనే మీకు దొరికినట్లు… మీరు నన్ను పట్టుకోలేరు.. మీ టెక్నాలజీ కంటే ఐదేండ్లు ముందున్నా’.. అంటూ ఓ కార్ల దొంగ పలు రాష్ట్రాల పోలీసులకు సవాల్ విసురుతున్నాడు. ఇతడిని పట్టుకునేందుకు ట్రై కమిషనరేట్ల పోలీసులు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఎంబీఏ చదివిన రాజస్థాన్కు చెందిన సత్యేంద్రసింగ్ షెకావత్ టెక్నాలజీపై పట్టుంది. స్కానింగ్ పరికరం, ఎలక్ట్రానిక్ కీ కట్టర్ సహాయంతో జీపీఎస్ పరికరానికి సంబంధించిన లింక్ను కట్ చేసి కార్లను అపహరిస్తుంటాడు. గతంలో ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్ పోలీసులకు దొరికిపోయాడు. మరోసారి చిక్కకుండా ఉండేందుకు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంపై పూర్తి అవగాహన పెంచుకున్నాడు. ఇప్పుడు పలు రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్గా మారాడు. ప్రధాన పట్టణాల్లో సుమారు 60 కార్లను తస్కరించాడు.
ఈ ఏడాది జనవరిలో బంజారాహిల్స్లోని పార్క్ హయత్ వద్ద బెంగళూరుకు చెందిన కన్నడ సినీ నిర్మాత మంజునాథ్ ఫార్చునర్ వాహనాన్ని పార్కింగ్ స్థలం నుంచి అపహరించాడు. అక్కడ సీసీ కెమెరాలు ఉన్నా..కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. ఔటర్ రింగ్రోడ్డు వరకు వెళ్లి.. తిరిగి సిటీకి వచ్చాడు. ఔటర్ రింగ్ ప్రాంతంలో రెండు మూడు రోజులు పార్కింగ్ చేసి.. అక్కడి నుంచి కారు కన్పించకుండా చేశాడు. దర్యాప్తులో భాగంగా బంజారాహిల్స్ పోలీసులు నగరంలోని సీసీ కెమెరాలు వెతకడంతో కారు ఎక్కడ తిరిగిందనే విషయాన్ని ఆరా తీశారు. దొంగ జైపూర్కు చెందిన వాడని గుర్తించి అక్కడకు వెళ్లారు.
జైపూర్లో నిందితుడి ఇంటిని గుర్తించి అక్కడకు వెళ్లిన బంజారాహిల్స్ పోలీసులకు సత్యేంద్ర ఊహించని షాక్ఇచ్చాడు. దర్యాప్తు అధికారులకు వాట్సాప్ కాల్ చేసి.. ‘సార్ కంగ్రాట్స్ నన్ను గుర్తించి మా ఇంటి వరకు వచ్చారు. నేను మీకు దొరకను.. నన్ను పట్టుకోవడం మీతరం కాదు.. ఇంత దూరం వచ్చారు.. జైపూర్ అందాలను చూసి, ఫలాన హోటల్లో మంచి భోజనం దొరుకుతుంది తిని వెళ్లండి’ అంటూ ఉచిత సలహా ఇచ్చాడు. ‘అయితే మీరు మాకు అతిథులు.. గంట సమయం ఇస్తే నా భార్యనే మంచి భోజనం తయారు చేసి పెడుతుందం’టూ మాట్లాడాడు. ‘నా ఇంటిని గుర్తించి వచ్చినందుకు.. మీకు హ్యాట్సాఫ్ చెబుతున్నా’.. అంటూ.. అధికారితో కాల్ కట్ చేశాడు.
ఏప్రిల్లో రాచకొండ నాచారం పోలీస్స్టేషన్ పరిధిలో ఓ సాప్ట్వేర్ ఇంజినీర్కు చెందిన కారును అపహరించాడు. బంజారాహిల్స్ పోలీసులతో సమాచారం తీసుకున్న నాచారం పోలీసులు, ప్రధాన దొంగకు సహకరిస్తున్న అతడి భార్యను జైపూర్ వెళ్లి అరెస్ట్ చేయగా, ఆమె బెయిల్ పొందడంతో తిరిగి వచ్చేశారు. ఇంతలో ఆగస్టు 5న బౌరంపేట్లో ఓ ఫార్మా కంపెనీకి చెందిన వైస్ ప్రెసిడెంట్ కారు చోరీకి గురైంది. దీనిని కూడా ఆ దొంగే అపహరించాడని పోలీసులు భావిస్తూ..ఆ దిశగా దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, ఎన్నో సంచలనాత్మకమైన కేసుల చిక్కుముడి విప్పిన పోలీసులకు.. ఈ టెక్నాలజీ దొంగ విసురుతున్న చాలెంజ్ను ఎలా ఎదురుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.
మరోసారి బంజారాహిల్స్ పోలీసులు జైపూర్ వెళ్లి దొంగ కోసం గాలింపు చేపట్టారు. నిందితుడు ఈ విషయాన్ని గుర్తించి ‘సార్ నమస్తే.. మరోసారి మీరు జైపూర్కు వచ్చారా? అయితే నేను ఇప్పుడు బెంగళూర్లో ఉన్నా’ అంటూ వాట్సాప్ కాల్లో మాట్లాడాడు. పోలీసుల టెక్నాలజీ కంటే నేను ఐదేండ్ల ముందున్నా.. మీరు నా టెక్నాలజీకి చేరుకునే వరకు నేను మరో ఐదేండ్లు ముందుంటా.. నన్ను పట్టుకోలేరం’టూ మరోసారి చాలెంజ్ విసిరాడు. ‘మీరు పట్టుకోవాలంటే ఇప్పుడు నేను బెంగళూర్లో ఒక గంట సేపు ఉంటా.. దమ్ముంటే పట్టుకోండి..మీరు జైపూర్ నుంచి రావడానికి కనీసం రెండు రోజులు పడుతుందం’టూ హేళనగా మాట్లాడి కాల్ కట్ చేశాడు.