ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం నియమావళి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: దేశంలో కరోనా రెండో వేవ్కు ఎన్నికల సంఘమే కారణమని మద్రాస్ హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టిన నేపథ్యంలో ఈసీ దిద్దుబాటు చర్యలు చేపడుతున్నది. ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు ర్యాలీలు నిర్వహించరాదని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన ఈసీ.. ఓట్ల లెక్కింపునకు మార్గదర్శకాలు జారీచేసింది. కౌంటింగ్ సందర్భంగా అభ్యర్థులుగానీ, ఏజెంట్లుగానీ కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లాలంటే తప్పనిసరిగా కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ను సమర్పించాలని స్పష్టంచేసింది. లేదా కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నట్లు పత్రాన్ని సమర్పించాలని ఆదేశించింది. ఓట్ల లెక్కింపునకు 48 గంటల ముందు ఈ సర్టిఫికెట్లను అధికారులకు సమర్పించాలని ఆదేశించింది. కౌంటింగ్ కేంద్రాల బయట భారీగా జనాలు గుమికూడకూడదని నిర్దేశించింది. తొలుత సూచించిన ఏజెంటుకు ఒకవేళ కరోనా సోకితే అతడి స్థానంలో మరొకరి పేరును సూచించడానికి అభ్యర్థులకు అవకాశం కల్పించింది. అభ్యర్థులకు, కౌంటింగ్ ఏజెంట్లకు కరోనా పరీక్షలు చేసేందుకు జిల్లా ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేయాలని సూచించింది. అభ్యర్థులు, ఏజెంట్ల కోసం సరిపడా పీపీఈ కిట్లను అందుబాటులో ఉంచాలని కోరింది. పశ్చిమబెంగాల్, అసోం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు వచ్చే నెల 2న చేపట్టనున్న విషయం తెలిసిందే.
ఈసీ అధికారులపై హత్య కేసు పెట్టండి
ఈసీ సీనియర్ అధికారులపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని కరోనా సోకి ఇటీవల మరణించిన తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి కాజల్ సిన్హా భార్య నందితా సిన్హా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 21న కాజల్ సిన్హాకు కరోనా సోకింది. 25న ఆయన మరణించారు. తన భర్త మరణానికి కారణమైన కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలో ఈసీ అధికారులు విఫలమయ్యారని నందితా సిన్హా పేర్కొన్నారు.