కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పదమూడేండ్ల పోరాటంతో ప్రజల చిరకాల వాంఛ తెలంగాణ రాష్ట్ర స్వప్నం సాకారమైంది. ప్రజలు తమకు రాష్ట్రం సాధించిపెట్టిన కేసీఆర్కు పాలనా బాధ్యతలు అప్పజెప్పి ఏడేండ్లయ్యింది. 67 ఏండ్ల స్వాతంత్య్రానంతర పాలన, 58 ఏండ్ల వలస పాలనలో వివక్షకు గురైన తెలంగాణను ప్రగతిపథంలో నడిపించడానికి ఏడేండ్లుగా కేసీఆర్ అవిరళ కృషి చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టు జాతీయ పార్టీల కబంధహస్తాల నుంచి తెలంగాణను విముక్తం చేసి, రాష్ర్టాన్ని అభివృద్ధి చేసేపనిలో నిమగ్నమయ్యారు. జాతీయపార్టీల పాలనలో ఏ గుర్తింపునకూ నోచుకోని తెలంగాణను దేశంలోనే ప్రథమస్థానంలో నిలిపే తపస్సు కేసీఆర్ చేస్తున్నారు.
ఈ ఏడేండ్లలో దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని సంక్షేమ పథకాలతో పాటు రాష్ర్టానికి అవసరమయ్యే మౌలిక మార్పులను తీసుకొస్తున్నారు. ఓ రచయిత విజయం ప్రాంతీయ ముద్రతో విశ్వజనీన సాహిత్యం సృష్టించడంలో ఉన్నట్టే, ఓ రాజకీయ నాయకుడి విజయం తనదైన ప్రాంత, రాష్ట్ర ముద్రతో సార్వజనీన, సార్వకాలీన పనులతో పాలనను అందించడంలో ఉంటుం ది. అంటే ఓ ప్రాంతీయ పార్టీ నాయకుడు Think globally act locally అనేవిధంగా పాలన సాగించాలి. ఏడేండ్లలో రాష్ట్రంలో అనేక మౌలిక మార్పులు చేస్తూ పాలన సాగిస్తూ దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నారు.
ఓ జాతిని జయించాలంటే ఆ జాతి సంస్కృతిని, భాషను బలహీనపరిచి పరాయి సంస్కృతిని ఉన్నతీకరించారని చెప్పడానికి చరిత్ర పొడవునా అనేక ఉదాహరణలున్నాయి. ఆర్యులు, ఆంగ్లేయుల్లాగే ఆంధ్రపాలకులు కూడా తెలంగాణపై సాంస్కృతిక, భాషాధిపత్యం కొనసాగించారు. తెలంగాణ భాషను సంస్కృతులను కించపరిచారు. తెలంగాణ పండుగలను తక్కువ చేశారు. తెలంగాణ భాషను విలన్, కమెడియన్ల భాషగా మీడియాలో చిత్రించారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి మాత్రమే కాదు తన జీవితమంతా కేసీఆర్ తెలంగాణ జీవద్భిక్షకు ప్రాణప్రతిష్ఠ చేశారు. ఇదీ మా భాష, మా సం స్కృతి అని ఎలుగెత్తిచాటారు. తెలంగాణ భాషకు సాహిత్య గౌరవం మాత్రమే కాదు, పార్లమెంటరీ గౌరవం తీసుకొచ్చా రు. బతుకమ్మ పండుగకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చారు. తెలంగాణ భాష సంస్కృతులు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగడం కేసీఆర్ వల్లే సాధ్యమైంది.
ఏడేండ్ల కిందటి వరకు తెలంగాణలో వలసాధిపత్యమే కొనసాగింది. నిధులు, నియామకాలు, తెలంగాణకు రావాల్సిన నీటి వాటా విషయంలోనూ తెలంగాణకు అన్యాయం జరిగింది. తెలంగాణకేం కావాలో స్పష్టత ఉన్న కేసీఆర్ ముఖ్యమంత్రి కావ డం వల్ల ఈ ఏడేండ్లలో వలసాధిపత్యం తగ్గింది. తద్వారా అభివృద్ధిలోనూ తెలంగాణ ముద్ర, ఆర్తి కనబడుతున్నది. చిన్న జిల్లాల ఏర్పాటు, మత సామరస్యం కాపాడటం, శాంతిభద్రతల పరిరక్షణ, బహుళ జాతి కంపెనీల పెట్టుబడులు ఆకర్షించడం వంటి మౌలిక మార్పులెన్నో వచ్చాయి.
ఆంధ్ర ప్రాంతం వారిది సినిమా సంస్కృతి తెలంగాణది జానపద మౌఖిక సంస్కృతి. తెలంగా ణ మౌఖిక, జానపద కళలకు పెద్దపీట వేయడంద్వా రా తెలంగాణ సంస్కృతికి పట్టం కట్టారు కేసీఆర్.
దశాబ్దాలుగా సాగు, తాగునీటి సమస్యల్లోనూ, విద్యుత్ సమస్యలోనూ బాధపడుతున్న తెలంగాణాను ఆ కొరత నుంచి విముక్తి చేయడం తెలంగాణ సాధించిన గొప్ప విజయం. ఎండకాలంలోనూ చెర్లు మత్తల్లు దుంకడం అపూర్వం. తెలంగాణను జలసిరిగల రాష్ట్రంగా మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టు ఓ అద్భుతం. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి పథకాల వల్ల సాగు, తాగునీటి సమస్యలు తీరడమే కాకుండా అన్నీ ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండి భూగర్భజలాలు పెరిగాయి. రైతు బంధు లాంటి అద్వితీయ పథకాలు వ్యవసాయం దండుగ అనే స్థితి నుంచి వ్యవసాయం పండుగగా మార్చాయి. కులాలను బట్టి వృత్తి ఆదాయ మార్గాలున్న పరిస్థితుల్లో ఆయా వృత్తిపనుల ఆదాయమార్గాలు పెంచడం పాలకులు చేయాల్సిన ముఖ్య పనుల్లో ఒకటి. ఆయా వృత్తిపనుల వారికి వారి వృత్తి సంబంధమైన పని ముట్లను ఇచ్చి ఆదాయమార్గాలను పెంచిన తీరు అనితరసాధ్యం.
ప్రజాస్వామ్య ప్రభుత్వాలు వచ్చి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన తర్వాత ప్రపంచంలో ఏ దేశంలోనూ సాయుధ విప్లవాలు విజయవంతం కాలేదు. సంక్షేమ అభివృద్ధి సంక్షేమ పథకాలు సరి గ్గా అమలైతే ప్రజలు ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంటుంది. వివిధ సంక్షే మ పథకాలతో తెలంగాణ సబ్బండవర్ణాలు మధ్య తరగతిగా ఎదగడానికి అవసరమయ్యే మౌలిక మార్పులు తెలంగాణలో జరుగుతున్నాయి.
హైదరాబాద్తో పాటు తెలంగాణ జిల్లాలు ఐటీ ఫార్మా హబ్ లుగా మారడానికి అవసరమైన మౌలిక వసతులన్నీ ప్రభుత్వం కల్పిస్తున్నది. హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి ప్రముఖ కంపెనీలన్నీ ఆసక్తి చూపడం గమనించవచ్చు.సాంఘిక సంక్షేమ ఆశ్రమ విద్యాలయాలు ద్వారా తెలంగాణ బహుజనులు నాణ్యమైన ఇంగ్లీషు మాధ్యమ విద్యను ఉచితంగా పొందుతున్నారు. మోడల్ కళాశాలలను పెంచడం, ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేయడం వంటి అనేక పనులు తెలంగాణలో జరుగుతున్నాయి. తెలంగాణ హృదయం ఎరిగిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండటం వల్లే ఇదంతా సాధ్యం అవుతున్నది.
వ్యవసాయిక వనరులతో పాటు, పారిశ్రామిక ప్రగతికి అవసరమైన ముడిసరుకులు విశేషంగా ఉన్న తెలంగాణ ధనిక రాష్ట్రం అనడంలో సందేహం లేదు. ఆదిలాబాద్, నల్లమల అటవీ సంపద తెలంగాణకు అనర్ఘ రత్నాలు. హైదరాబాద్ గుండెకాయగా తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి చెంది దేశ పటంలో మాత్రమే కాదు ప్రపంచపటంలో శాశ్వతస్థానం సంపాదించింది. స్వల్పకాలంలోనే ఇన్ని మౌలిక మార్పు లు తేవడం కేసీఆర్కు, స్థానిక పార్టీ టీఆర్ఎస్కు మాత్రమే సాధ్యం. ఈ ఏడేండ్ల తెలంగాణ పాలన దీన్నే రుజువు చేస్తున్నది.
దశాబ్దాలుగా సాగు, తాగునీటి సమస్యల్లోనూ, విద్యుత్ సమస్యలోనూ బాధపడుతున్న
తెలంగాణను ఆ కొరత నుంచి విముక్తి చేయడం తెలంగాణ సాధించిన గొప్ప విజయం.
ఎండకాలంలోనూ చెరువులు మత్తళ్లు దుంకడం అపూర్వం. తెలంగాణను జలసిరిగల
రాష్ట్రంగా మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టు ఓ అద్భుతం.
డాక్టర్ కాలువ మల్లయ్య