పుణే : ఐటీ కంపెనీలో పనిచేసే మహిళ(32)కు నీళ్లలో మత్తుమందు కలిపి ఇచ్చి హోటల్లో ఆమెపై నెలరోజుల పాటు లైంగిక దాడికి పాల్పడిన క్యాబ్ డ్రైవర్ ఉదంతం మహారాష్ట్రలోని పుణేలో వెలుగుచూసింది. నిందితుడు మహిళపై లైంగిక దాడికి పాల్పడటంతో పాటు ఆమె అభ్యంతరకర ఫోటోలను రికార్డు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..విమన్ నగర్లోని ఐటీ కంపెనీలో పనిచేసే మహిళ మార్చి 4న నైట్ షిఫ్ట్ పూర్తి కాగానే తెల్లవారుజామున నాలుగు గంటలకు ముంధ్వాలోని స్కూల్ ఫ్రెండ్స్ను కలిసేందుకు వెళ్లారు.
అక్కడినుంచి ఇంటికి చేరుకునేందుకు ఆమె క్యాబ్ బుక్ చేసుకున్నారు. క్యాబ్ డ్రైవర్ ప్రమోద్ బాబు కనోజియా ఆమెకు మత్తుమందు కలిపిన నీళ్లు ఇచ్చి హోటల్కు తీసుకువెళ్లాడు. స్పృహ కోల్పోయిన స్ధితిలో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అభ్యతరకర ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరిస్తూ మార్చి 4 నుంచి 30 వరకూ ఆమెపై దారుణానికి పాల్పడ్డాడు. నిందితుడి చెర నుంచి బయటపడిన బాధితురాలు మంధ్వా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.