చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నవజోత్ సింగ్ సిద్ధూ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. కాగా, ఈ కార్యక్రమానికి వెళ్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయాణిస్తున్న ప్రైవేట్ మినీ బస్సు, పంజాబ్ రాష్ట్ర బస్సు ఢీకొన్నాయి. మోగా జిల్లాలోని లోహారా గ్రామంలో శుక్రవారం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు చనిపోగా పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు మోగా జిల్లా ఎస్పీ తెలిపారు.
మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురికావడం విచారకరమని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు కాంగ్రెస్ కార్యకర్తలు చనిపోగా పలువురు గాయపడినట్లు ట్వీట్ చేశారు. క్షతగాత్రులకు వైద్య చికిత్స అందించాలని, ప్రభుత్వానికి రిపోర్టు పంపాలని మోగా జిల్లా అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు.