వారణాసి : యూపీలోని వారణాసిలో ప్రముఖ డాక్టర్ను ఆమె మరిది దారుణంగా హత్య చేసిన ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. బుధవారం ఉదయం హత్యకు సంబంధించి డయల్ 112 హెల్ప్లైన్కు ఫోన్ కాల్ రావడంతో వారణాసిలోని మహమూర్గంజ్ ప్రాంతంలోని అడ్రస్కు వెళ్లిన పోలీసుల బృందానికి మహిళ విగతజీవిగా కనిపించారు. మృతురాలిని మాజీ ఎమ్మెల్యే రజనీకాంత్ దత్తా కోడలు ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ సప్న దత్తాగా గుర్తించారు.
కుటుంబ వివాదం నేపథ్యంలో బాధితురాలిని ఆమె మరిది అనిల్ దత్తా హత్య చేశాడని దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు. అనిల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సప్నపై తాను పదునైన ఆయుధాలతో దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలై ఆమె మరణించిందని అనిల్ తన నేరం అంగీకరించారు.
అస్వస్ధతకు లోనైన తల్లితండ్రులను చూసేందుకు తాను వెళతుండగా వదిన తనను చూసి పెద్దగా నవ్వుతూ నపుంసకుడంటూ నిందించిందని వీడియో క్లిప్లో నిందితుడు అనిల్ చెబుతుండటం కనిపించింది. ఆమె నవ్వుతుండగా తాను వాగ్వాదానికి దిగానని ఆపై ఆగ్రహంతో పదునైన ఆయుధాలతో ఆమెపై దాడి చేశానని చెప్పాడు. గతంలోనూ ఆమె తనను, తన సోదరుడిని నపుంసకులంటూ నిందించిందని చెప్పుకొచ్చాడు. అనిల్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.