అహ్మదాబాద్: మొబైల్ ఫోన్లో గేమ్ ఆడటంపై తండ్రి తిట్టగా, గొంతు నొక్కి కుమారుడు హత్య చేశాడు. గుజరాత్లోని సూరత్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. బుధవారం ఒక వ్యక్తిని ఇచ్ఛాపూర్లోని న్యూ సివిల్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. పరిశీలించిన డాక్టర్లు అప్పటికే అతడు చనిపోయినట్లు చెప్పారు. ఆసుపత్రి సిబ్బంది దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆసుపత్రికి వచ్చిన పోలీసులు ఆ వ్యక్తి ఎలా చనిపోయాడని ఆరా తీశారు. బాత్రూమ్లో జారిపడి మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
మరోవైపు ఆ వ్యక్తి మృతదేహానికి గురువారం పోస్ట్మార్టం నిర్వహించారు. గొంతునొక్కడం వల్ల అతడు మరణించినట్లు పోస్ట్మార్టం రిపోర్టులో వైద్యులు పేర్కొన్నారు. దీంతో పోలీసులు ఆ కుటుంబాన్ని ప్రశ్నించగా 17 ఏండ్ల బాలుడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. మొబైల్లో గేమ్ ఆడుతున్న తనని తండ్రి తిట్టాడని, ఈ సందర్భంగా ఇద్దరి మధ్య ఘర్షణ జరిగిందని తెలిపాడు. తాను గొంతునొక్కడంతో తన తండ్రి చనిపోయినట్లు చెప్పాడు. దీంతో బాలుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు జువెనైల్ హోమ్కు తరలించారు.