అక్టోబర్ 15న ఫైనల్
న్యూఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్ రెండోదశ నిర్వహణకు బీసీసీఐ ప్రాథమికంగా షెడ్యూల్ ఖరారు చేసినట్టు సమాచారం. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19న ఈ ఏడాది టోర్నీ పునఃప్రారంభమవుతుందని బీసీసీఐ అధికారి ఒకరు సోమవారం వెల్లడించారు. అలాగే దసరా పర్వదినమైన అక్టోబర్ 15న ఫైనల్ జరుగుతుందని తెలిపారు. బయో బబుల్లో కరోనా కేసులు వెలుగులోకి రావడంతో 31 మ్యాచ్లు మిగిలి ఉండగానే ఈ ఏడాది ఐపీఎల్ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
తెరపైకి శ్రీలంక
ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ నిర్వహణ రేసులోకి శ్రీలంక కూడా వచ్చింది. యూఏఈ, మస్కట్లో మెగాటోర్నీని జరిపేందుకు ఐసీసీకి అంగీకారం తెలిపిన బీసీసీఐ.. శ్రీలంక క్రికెట్ బోర్డుతోనూ చర్చిస్తున్నదని ఆ అధికారి చెప్పారు. ప్రపంచకప్ నిర్వహణపై ఐసీసీ, బీసీసీఐ త్వరలోనే సమావేశమై ఓ నిర్ణయానికి వస్తాయని వెల్లడించారు. కాగా కరోనా ప్రభావం వల్ల భారత్ నుంచి మెగాటోర్నీని తరలించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.