ప్రభుత్వానికి టీఎన్జీవో నాయకుల విజ్ఞప్తి
హైదరాబాద్/ సుల్తాన్బజార్, జూన్15 (నమస్తే తెలంగాణ): పీఆర్సీ అమలులో ఏర్పడే సమస్యల పరిష్కానికి వ్యత్యాసాల సవరణ కమిటీ (అనామలీస్ కమిటీ)ని ఏర్పాటుచేయాలని టీఎన్జీవోలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, రాయికంటి ప్రతాప్ నేతృత్వంలోని బృందం మంగళవారం బీఆర్కే భవన్లో రాష్ట్ర సీఎస్ సోమేశ్ కుమార్ను కలిసి వినతిపత్రాన్ని అందజేసింది. ఉద్యోగులకు 11వ పీఆర్సీ అమలు కోసం ఈ నెల 11న ఒకేసారి 10 జీవోలు విడుదల చేసినందుకు వారు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కరోనా బారిన పడి మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని సీఎస్ హామీ ఇచ్చారని టీఎన్జీవో నాయకులు తెలిపారు. సీఎస్ను కలిసిన వారిలో టీఎన్జీవో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, సత్యనారాయణ గౌడ్, కోశాధికారి రామినేని శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి కొండల్రెడ్డి, గోవర్థన్రెడ్డి కూడా ఉన్నారు. అనంతరం వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావును కలిశారు. ఆరోగ్యశాఖలోని కొందరు ఉద్యోగులు కరోనా కాటుకు బలయ్యారని, వారి కుటుంబసభ్యులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు.