సిద్దిపేట టౌన్, మే 14 : సమాజం లో కుల వ్యవస్థ, వర్ణబేధాలను, లింగ వివక్షతను వ్యతిరేకించిన అభ్యుదయవాది లింగాయత్ ధర్మం స్థాపించిన మహాత్మా బసవేశ్వరస్వామి అని సీపీ జోయల్ డెవిస్ అన్నారు. బసవేశ్వరస్వామి జయంతిని శుక్రవారం కమిషనరేట్లో నిర్వహించారు. ఈ సందర్భం గా సీపీ మాట్లాడుతూ చిన్న వయస్సులోనే శైవపురాణ గాథలను అవగతం చేసుకొని రాజ్యపాలనలో ముఖ్య భూ మిక పోషించారన్నారు. రచన, సాహిత్యంతో బసవేశ్వరుడు ప్రజలందరినీ ఏకం చేశారని కొనియాడారు. ఎంతో మందిని తన బోధనలతో ఆకర్షించి వీర శైవమతానికి పట్టం కట్టారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
హైందవ మత సంస్కర్త.. బసవేశ్వరుడు
సిద్దిపేట అర్బన్, మే 14 : అభ్యుదయవాది, హైందవ మత సంస్కర్త, కుల వ్యవస్థను, వర్ణ బేధాలను వ్యతిరేకించిన వ్యక్తి బసవేశ్వరుడని మాజీ మున్సిపల్ చైర్మన్ అన్నారు. బసవేశ్వరుడి 888వ జయంతి సందర్భంగా సిద్దిపేట పొన్నాల జంక్షన్లోని బసవేశ్వర విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, కిర్మి సోమయ్య, శివప్ప, గౌరయ్య, నాగరాజు, శంకర్, భిక్షపతి పాల్గొన్నారు.
కులరహిత సమాజాన్ని నిర్మాణానికి కృషి
చేర్యాల, మే 14 : కొమురవెల్లి మల్లికార్జున ఆలయం ఈవో బాలాజీ ఆధ్వర్యంలో బసవేశ్వర జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. బసవేశ్వరుడు వీరశైవ సిద్ధాంతాన్ని పాటిస్తూ అన్ని కులాలు, మతాలు సమానమని తెలియజేయడంతో పాటు మహిళలకు సమానత్వపు హక్కులను కల్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఈవో వైరాగ్యం అంజయ్య, పర్యవేక్షకుడు నీల చంద్రశేఖర్, ఏఈ అంజయ్య పాల్గొన్నారు.