పాట్నా: ఒక మహిళ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అతడి మృతదేహాన్ని ముక్కలుగా నరికి రసాయనాల్లో కరిగించేందుకు ప్రయత్నించగా పేలుడు జరిగింది. దీంతో పోలీసుల రంగప్రవేశంతో అసలు గుట్టు రట్టయ్యింది. బీహార్ రాష్ట్రం ముజఫర్పూర్లోని సికందర్పూర్లో ఈ ఘటన జరిగింది.
బీహార్లో మద్యం అమ్మకాలను నిషేధించారు. అయితే, సికందర్పూర్ ప్రాంతంలో నివాసం ఉండే రాకేశ్ అక్రమంగా మద్యం విక్రయించేవాడు. దీంతో ఇంటికి దూరంగా రహస్య ప్రాంతంలో ఉండేవాడు. ఈ నేపథ్యంలో రాకేశ్ భార్య రాధకు, అతడి వ్యాపార భాగస్వామి సుభాష్ మధ్య ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో భర్త అడ్డు తొలగించుకోవాలని రాధ, సుభాష్ నిర్ణయించారు.
తీజ్ పండుగ సందర్భంగా రాధ తన భర్తను ఇంటికి రమ్మని పిలిచింది. ఇంటికి వచ్చిన భర్త రాకేశ్ను భార్య రాధ, సుభాష్, రాధ సోదరి కృష్ణ, సోదరి భర్త కలిసి హత్య చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా రాకేశ్ మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించారు. మృతదేహాన్ని చిన్న ముక్కలుగా నరికి రసాయనాల్లో కరిగించేందుకు యత్నించారు. ఈ క్రమంలో పేలుడు జరిగింది.
అదే ప్రాంతంలో ఉన్న రాకేశ్ సోదరుడు దినేష్ సాహ్ని పేలుడు శబ్దం విని ఆ ఇంటికి వెళ్లాడు. వారంతా కలిసి తన సోదరుడ్ని హత్య చేసినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆ ఇంటికి వచ్చి పరిశీలించారు. చెల్లాచెదురైన మృతదేహాన్ని సేకరించి పోస్ట్మార్టం నిర్వహించారు. భార్య రాధ, ప్రియుడు సుభాష్, ఆమె సోదరి, సోదరి భర్తపై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.