పాట్నా: తన పెంపుడు మేకను పొరుగింటి వ్యక్తి హత్య చేసినట్లు ఆరోపిస్తూ ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బీహార్లోని కైమూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. చౌరసీహ్ గ్రామానికి చెందిన రాధా దేవి ఒక మగ మేకను పెంచుతున్నది. ఈ నెల 15న ఆ మహిళ పొలం పనులకు వెళ్లింది. మరోవైపు ఆమె మేక పొరుగున్న ఉన్న సిపు రామ్కు చెందిన ఆడ మేక వద్దకు వెళ్లింది. గమనించిన అతడు ఆగ్రహం చెంది కర్రతో ఆ మేకను కొట్టాడు. దీంతో అది చనిపోయింది.
కాగా, పొలంలో ఉన్న రాధా దేవికి ఆమె మేకను రామ్ కొడుతున్న విషయాన్ని కొందరు స్థానికులు చెప్పారు. దీంతో ఆమె పరుగున తన ఇంటికి వచ్చింది. కింద పడి ఉన్న తన మేకను, రామ్ చేతిలో కర్రను రాధా దేవి చూసింది. అతడు ఆమెను హెచ్చరించడంతో చనిపోయిన మేకను తీసుకుని మోహానియా పోలీస్ స్టేషన్కు వెళ్లింది. తన పెంపుడు జంతువు పట్ల కూర్రత్వంగా ప్రవర్తించి హత్య చేసిన సికు రామ్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది.
మరోవైపు రాధా దేవి ఫిర్యాదు మేరకు ఆమె పెంపుడు మేక మరణంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మోహానియా పోలీసులు తెలిపారు. మేక మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం పశు వైద్యశాలకు తరలించినట్లు చెప్పారు. రిపోర్ట్ వచ్చిన తర్వాత చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.