పట్నా : ఒకే కులానికి చెందిన యువతీ యువకులు ఒక్కటయ్యేందుకు సిద్ధమైనా ఇరు కుటుంబాల్లో పెద్దలు అంగీకరించలేదు. పెద్దల విముఖతతో విసిగిన జంట పోలీసులను ఆశ్రయించగా లాక్ డౌన్ సమయంలో వారి వివాహానికి పోలీస్ స్టేషనే వేదికైన ఘటన పట్నాలో వెలుగుచూసింది. పటేరికి చెందిన స్నేహ కుమారి, బభువ ప్రాంతానికి చెందిన శుభం కుమార్ గత ఏడాది కాలంగా సన్నిహితంగా మెలుగుతున్నారు.
వీరి వివాహానికి ఇరు కుటుంబాల పెద్దలు వ్యతిరేకించారు. లాక్ డౌన్ అమలవుతుండటంతో పోలీసులను ప్రేమ జంట ఆశ్రయించగా స్టేషన్ ప్రాంగణంలోని ఆలయంలో పెండ్లి తంతు జరిపించారు. ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలనూ ఒప్పించిన పోలీసులు వారి సమక్షంలోనే వివాహం జరిపించారు. ప్రేమ జంట వివాహాన్ని దగ్గరుండి జరిపించిన పోలీసులు కొత్త జంటకు దీవెనలు అందించడంతో పాటు వారికి బహుమతులు అందచేశారు.