కోల్కతా: ఒక చోరీ కేసు దర్యాప్తు కోసం పశ్చిమ బెంగాల్కు వచ్చిన బీహార్ పోలీస్ అధికారిని స్థానికులు కర్రలు, రాళ్లతో దాడి చేసి కొట్టి చంపారు. ఉత్తర దినాజ్పూర్ జిల్లాలోని గోల్పోఖర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బీహార్లోని కిషన్గంజ్ పోలీస్ స్టేషన్ హెడ్ ఆఫీసర్ అశ్విని కుమార్ ఒక బైక్ చోరీ కేసు దర్యాప్తు కోసం బెంగాల్లోని పంజీపర పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామానికి వెళ్లారు. నిందితుల కోసం అక్కడ తనిఖీ చేస్తుండగా స్థానికులు కర్రలు, రాళ్లతో దాడి చేశారు.
తీవ్ర గాయాలతో పడి ఉన్నపోలీస్ అధికారి అశ్విని కుమార్ను ఇస్లాంపూర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు. ఆయన మరణానికి కారణమైన ఒకరిని స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. తనిఖీలు చేసి మరికొందరిని అరెస్ట్ చేస్తామని పూర్ణియ రేంజ్ ఐజీ తెలిపారు.
మరోవైపు అశ్విని కుమార్ స్థానిక బెంగాల్ పోలీసుల సహాయం కోరినా వారు సహకరించలేదని, పోలీస్ బృందాలను పంపుతామని చెప్పి ఉద్దేశపూర్వకంగా పంపలేదని బీహార్ పోలీసుల సంఘం ఆరోపించింది.