పాట్నా: గంగా నదిలో ప్రయాణిస్తున్న ఒక పడవ హైటెన్షన్ విద్యుత్ వైర్కు తగిలింది. దీంతో అందులోని సుమారు 36 మందికి కరెంట్ షాక్ వల్ల గాయాలయ్యాయి. మరోవైపు నదిలో పడిన వారిలో సుమారు 15 మందికిపైగా గల్లంతైనట్లు సమాచారం. బీహార్లోని వైశాలి జిల్లాలో ఈ ఘటన జరిగింది. శనివారం రాత్రి 8 గంటలకు ఒక పడవ సుమారు 150 మంది ప్రయాణికులతో గ్రామీణ పాట్నాలోని కచ్చి దర్గా ఘాట్ నుండి వైశాలిలోని రాఘోపూర్ నదీ ప్రాంతానికి బయలుదేరింది. అందులోని చాలా మంది ప్రయాణికులు రోజువారీ కూలీలు. వారు శనివారం ఉదయం మొకామా, పాట్నాకు వచ్చి ఇంటికి తిరిగి వెళ్తున్నారు.
కాగా, పడవ గంగా నది మధ్యకు చేరుకోగా హైటెన్షన్ విద్యుత్ వైర్ను అది ఢీకొట్టింది. దీంతో పడవలో ఉన్న కనీసం మూడు డజన్ల మందికి కాలిన గాయాలయ్యాయి. చాలా మంది నదిలో పడిపోయారు. కొందరు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న వైశాలీ, పాట్నా జిల్లాల అధికారులు సంఘటనా స్థలానికి వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఫతుహాలోని పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేర్చారు. అయితే బోటులో ఎంత మంది ప్రయాణిస్తున్నారు, ఎంత మంది గల్లంతయ్యారు అన్నదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. బీహార్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల గంగా నదిలో నీటి మట్టం పెరుగడంతో ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారు.