కోల్కతా : తల్లిదండ్రులు సహా నలుగురు కుటుంబ సభ్యులను ఓ ఇంటర్ విద్యార్థి అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఫిబ్రవరి 17వ తేదీన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. బెంగాల్ మాల్దాలోని షేక్ష్పియర్ ప్రాంతంలో నివసించే జావేద్ అలీ కుటుంబానికి తన చిన్న కుమారుడు ఆసిఫ్ మహ్మద్ కాలయముడుగా మారాడు. తల్లీదండ్రులు, సోదరితో పాటు 62 ఏండ్ల వృద్ధురాలిని ఆసిఫ్ ఫిబ్రవరి 17న హత్య చేశాడు. ఆ తర్వాత సొంత ఇంటి ఆవరణలోనే నలుగురు మృతదేహాలను పూడ్చిపెట్టాడు.
ఆసిఫ్ దాడి నుంచి తప్పించుకున్న అతని సోదరుడు రాహుల్ షేక్ భయంతో నోరు విప్పకపోవడంతో ఇంతకాలం ఈ విషయం బయటకు రాలేదు. ఆసిఫ్ చేసిన హత్యలను ఎలాగైనా బయట పెట్టాలనుకున్న షేక్.. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మొదట రాహుల్ చెప్పిన విషయాలపై పోలీసులు సందేహం వ్యక్తం చేసినప్పటికీ, ఆసిఫ్ను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. ఆసిఫ్ నిత్యం డబ్బుల కోసం తన తండ్రి జావేద్ను వేధించేవాడని స్థానికులు పేర్కొన్నారు.