చెన్నూర్ రూరల్ : చెన్నూర్ మండలంలోని శివలింగపూర్ గ్రామానికి చెందిన అక్కెం మల్లయ్యపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం .. బతుకమ్మ పూల కోసం అక్కెం మల్లయ్య, పంచికపు రమేశ్లు ద్విచక్రవాహనంపై పాలవాగు సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లారు. అటవీప్రాంతంలో ఎడ్లబండి బాట మీదుగా వెళ్తుండగా ఎలుగుబంటి తన చిన్నపిల్లలతో కలిసి ఎదురుగా వచ్చింది. ఒక్కసారిగా ద్విచక్రవాహనం వెనుక కూర్చున్న అక్కెం మల్లయ్యపై తల్లి ఎలుగుబంటి దాడి చెసింది. దీంతో ద్విచక్రవాహనం నడుపుతున్న రమేశ్ కేకలు వేయడంతో మల్లయ్యను వదిలి అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది.
ఈ దాడిలో మల్లయ్య కాలు, చేయి మీద ఎలుగుబంటి దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని 108 అంబులెన్స్లో చెన్నూర్ ప్రభుత్వ దవాఖానకు, మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలలోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతున్న బాధితుడిని చెన్నూర్ ఫారెస్ట్ అధికారులు పరామర్శించారు. దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. మల్లయ్యకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందిస్తామని ఫారెస్టు రెంజ్ అధికారి మధుసూదన్ వెల్లడించారు.