అమరావతి : గుంటూరు నగరంలో బీటెక్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. నడిరోడ్డుపై యువతిని దుండగుడు కత్తితో పొడిచి పాశవికంగా హతమార్చాడు. కాకాని రోడ్డులోని పరామయకుంటలో ఈ ఘటన జరిగింది. మృతి చెందిన యువతిని నల్లపు రమ్యగా పోలీసులు గుర్తించారు. రమ్య నగరంలో సెయింట్ మేరీస్ కాలేజీలో బీటెక్ మూడో ఏడాది చదువుతున్నట్లు తెలిసింది. పట్టపగలే నడిరోడ్డుపై హత్య జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యువతి మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతదేహాన్ని గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ పరిశీలించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు నగరంలో గాలిస్తున్నారు. హత్య వెనుక ప్రేమ వ్యవహరమే కారణమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడు పట్టుబడితే అన్ని విషయాలూ బయటకు వస్తాయని పోలీసులు అంటున్నారు.