ఖమ్మం: సామాజిక రుగ్మతలపై ప్రజల్లో మరింత చైతన్యం పెరగాలని ట్రాఫిక్ సీఐ అంజలి అన్నారు. పోలీసు కళా జాగృతి ప్రదర్శనలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని ఆమె చెప్పారు. పోలీసు కళా జాగృతి ఆధ్వర్యంలో నగరంలోని లకారం ట్యాంక్ బండ్పై ట్రాఫిక్, సైబర్ నేరాలు, షీటీమ్, డయల్ 100 వంటి వాటిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన సీఐ అంజలి మాట్లాడుతూ యువత సన్మార్గంలో నడవాలంటే సమాజం పట్ల అవగాహన కలిగిఉండాలని అన్నారు.
ఈ సంకల్పంతోనే పోలీసు కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ ఆదేశాల మేరకు పోలీసు కళాకారులు విస్తృతంగా ప్రదర్శనలు ఇస్తూ అందరికీ చైతన్యం కలిగిస్తున్నారని తెలిపారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న మూఢనమ్మకాలు, సైబర్ నేరాలు, బాల్య వివాహాలు, ర్యాగింగ్, డ్రగ్స్ , ఆత్మహత్యలు వంటి అంశాలపై పోలీసు కళా జాగృతి బృందం ప్రజలను చైతన్య పరుస్తున్నదని ఆమె పేర్కొన్నారు.