జనగామ : భూతగాదాలతో వ్యక్తిపై గొడ్డలితో దాడి జరిగింది. ఈ సంఘటన జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం రంగరాయిగూడెంలో బుధవారం చోటుచేసుకుంది. సుజాత అనే మహిళ తన పొలం దున్నుతుండగా మంద సురేశ్ అనే వ్యక్తి అడ్డుకున్నాడు. పొలం విషయంలో వీరిమధ్య కొంతకాలంగా వివాదం నెలకొంది. ఇటీవల గ్రామ పెద్దలు పొలం సుజాతకు చెందుతుందని తీర్మానం చేశారు. గ్రామ పెద్దల తీర్మానంతో సుజాత తన పొలం దున్నుతుండగా సురేశ్ ఘర్షణకు దిగాడు. ఈ క్రమంలో సుజాత మరిది నర్సయ్య నిలదీయడంతో సురేశ్ అతడిపై గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు. దాడిలో నర్సయ్యకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఘన్పూర్ ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు.