గువహటి : అసోంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బొంగైగావ్ జిల్లాలో రెండేండ్లుగా నలుగురు వ్యక్తులు పలుమార్లు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని మహిళ ఆరోపించింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలూ చేపట్టలేదని ఆందోళన వ్యక్తం చేసింది. నిందితులు తన అభ్యంతరకర ఫోటోలను సోషల్ మీడియా వేదికలపై వ్యాప్తి చేసి తనను బ్లాక్మెయిల్ చేయడంతో పాటు కుటుంబసభ్యులను చంపుతామని బెదిరించారని ఆరోపించింది. భవ్లగురి ప్రాంతంలోని బౌడీ బజార్కు చెందిన బాధితురాలు (23) తనపై అదే ప్రాంతానికి చెందిన నలుగురు వ్యక్తులు రెండేండ్లుగా లైంగిక దాడులకు తెగబడ్డారని బొంగైగావ్ సదర్ పోలీస్ స్టేషన్లో సెప్టెంబర్ 29న ఫిర్యాదు చేసింది.
పోలీసులు కేసు నమోదు చేసినా వారిపై ఎలాంటి చర్య తీసుకోకపోవడంతో నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని బాధితురాలు వాపోయింది. తన నగ్న చిత్రాలను చూపుతూ వారు తనను, తన పిల్లలు, భర్తను చంపుతామని బెదిరిస్తూ లైంగిక వేధింపులకు గురిచేశారని పేర్కొంది. జిల్లా పోలీస్ ఉన్నతాధికారులను కలిసినా స్పందించలేదని తెలిపింది. కాగా ఈ కేసుకు సంబంధించి ఒక నిందితుడిని అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ తెలిపారు. నిందితులు సైతం బాధితురాలిపై కేసు నమోదు చేశారని వెల్లడించారు. బాధితురాలిని వైద్య పరీక్షలకు తరలించామని, ఆమె స్టేట్మెంట్ రికార్డు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని తెలిపారు.