గౌహతి: బాలికపై సామూహిక లైంగికదాడికి పాల్పడి హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడు తప్పించుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు కాల్పులు జరిపారు. గాయపడిన అతడ్ని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అస్సాంలోని మోరిగావ్ జిల్లా భుర్గావ్లో శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. బలిదుంగ గ్రామానికి చెందిన 9 ఏండ్ల బాలికపై బ్రహ్మపుత్ర నది సమీపంలోని జనపనార క్షేత్రంలో జూన్ 20న సామూహిక లైంగికదాడికి పాల్పడి అనంతరం హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. హోంశాఖను తన వద్దనే ఉంచుకున్న సీఎం హిమంత బిస్వా శర్మ గత నెల 25న డీజీపీతో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. సత్వర న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
కాగా, ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడిగా భావిస్తున్న 65 ఏండ్ల సయ్యద్ అలీని జూన్ 27న పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలకు అతడ్ని సంఘటన జరిగిన ప్రాంతానికి తీసుకెళ్లారు. మార్గమధ్యలో మరో పోలీస్ వాహనంలోకి అలీని ఎక్కించే క్రమంలో తప్పించుకుని పారిపోయేందుకు అతడు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. కాల్పుల్లో గాయపడిన నిందితుడ్ని గౌహతి మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించినట్లు మోరిగావ్ ఎస్పీ అపర్ణ నటరాజన్ తెలిపారు.