న్యూఢిల్లీ : యూపీలో నాయకత్వ మార్పు ఊహాగానాలకు బీజేపీ తెరదించింది. యోగి ఆదిత్యానాధ్ సారధ్యంలోనే కాషాయపార్టీ యూపీ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటుందని బీజేపీ నేత, ఆ పార్టీ రాజస్ధాన్ ఇన్చార్జ్ అరుణ్ సింగ్ బుధవారం స్పష్టం చేశారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో యోగి విఫలమయ్యారని సొంత పార్టీ ఎమ్మెల్యేలు అసమ్మతి స్వరం వినిపించడంతో యోగిని ముఖ్యమంత్రిగా తప్పిస్తారనే ప్రచారం ఊపందుకుంది. సీఎంపై అసమ్మతి పెరిగినా ఇటీవల ఢిల్లీ పర్యటనలో యోగి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ చీఫ్ జేపీ నడ్డాలతో సమావేశమై ప్రభుత్వంలో, పార్టీలో చేపట్టాల్సిన మార్పులపై చర్చించారు.
ఇక యోగి ఆదిత్యానాధ్ యూపీ అభ్యున్నతికి విశేషంగా శ్రమిస్తున్నారని ఆయనను మార్చాల్సిన అవసరం ఏముందని సింగ్ ప్రశ్నించారు. రాజస్ధాన్లో వసుంధర రాజె వర్గం, ఇతర నేతల మధ్య అంతర్గత విభేదాలపై ఆయన స్పందిస్తూ 2023 రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్ధిని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సరైన సమయంలో ప్రకటిస్తుందని అన్నారు. పార్టీని నష్టపరిచే విధంగా నాయకులు ఎవరైనా ప్రకటనలు చేస్తే వారిపై క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు.