లక్నో: ఒక జవాన్ ముగ్గురు మహిళలను పెండ్లి చేసుకున్నాడు. రెండో భార్య ఫిర్యాదుతో అతడి గుట్టు బయటపడటంతో పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానాలోని కురుక్షేత్రకు చెందిన మనీష్ కుమార్ భారత ఆర్మీలో హవిల్దార్. మొదటి భార్య మోనిక తన పిల్లలతో కలిసి అత్తామామల వద్ద ఉంటున్నది. కాగా, హైదరాబాద్లో పోస్టింగ్ సందర్భంగా షీలా సింగ్ అనే మహిళ మనీష్కు పరిచయం అయ్యింది. 2014 సెప్టెంబర్లో ఆమెను వివాహం చేసుకున్నాడు. 2016లో షీలా గర్భం దాల్చింది. అయితే మనీష్ కారణంగా ఆమెకు అబార్షన్ అయ్యింది.
2018లో డ్యూటీలో జాయిన్ పేరుతో మనీష్ కుమార్ హైదరాబాద్ నుంచి వెళ్లిపోయాడు. అతడి కోసం వెదికిన షీలా 2019లో ఆచూకీని కనిపెట్టింది. ఉత్తరప్రదేశ్లోని మీరట్ కంటోన్మెంట్లో విధులు నిర్వహిస్తున్నట్లు తెలుసుకుని అక్కడికి వెళ్లింది. దీంతో కంకర్ ఖేరా మెయిన్ బజార్లోని ఒక అద్దె ఇంట్లో ఆమెతో కలిసి ఉండసాగాడు. మరోసారి గర్భం దాల్చిన షీలా ఒక బాబుకు జన్మనిచ్చింది.
మరోవైపు చాందిని అన్సారీ అనే మరో మహిళను కూడా మనీష్ వివాహం చేసుకుని మీరట్లోని శ్రద్ధాపురిలో నివాసం ఉంటున్నట్లు షీలాకు తెలిసింది. దీంతో ఆగస్టు 26న చాందిని ఇంటికి వెళ్లిన షీలా అక్కడున్న మనీష్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నది. అనంతరం ముగ్గురు కలిసి కంకర్ ఖేరా పోలీస్ స్టేషన్కు వచ్చారు.
ఈ సందర్భంగా మనీష్ ముగ్గురిని పెండ్లి చేసుకున్నట్లు తెలిసింది. దీంతో తనను మోసగించి వివాహం చేసుకున్నట్లు షీలా సింగ్ ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు జవాన్ మనీష్ కుమార్ను అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు.