నిర్ణీత సమయంలో దుకాణాల బంద్
మందమర్రి, మే 3 : కరోనా విజృంభిస్తున్న దృష్ట్యా మందమర్రి పట్టణంలో మే 4వ తేదీ నుంచి మే 11వ తేదీ వరకు స్వచ్ఛందంగా వ్యాపార సముదాయాలు బంద్ పాటించాలని మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షుడు తమ్మిశెట్టి విజయకుమార్, ప్రధాన కార్యదర్శి తిరుమల్రెడ్డి, ఉపాధ్యక్షుడు బత్తుల సతీశ్బాబు, మాయ రమేశ్, గుండ్ల శ్రీనివాస్ సోమవారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. మందమర్రి పట్టణంలో కరోనా వేగంగా వ్యాపిస్తున్న కారణంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. వినియోగదారులు, వ్యాపారులు కరోనా బారిన పడుతున్నారని తెలిపారు. ఈ మేరకు లాక్డౌన్ పాటించాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఈ బంద్ మార్కెట్ ఏరియా నుంచి పాలచెట్టు ఏరియా వరకు అన్ని వ్వాపార సముదాయాల నిర్వాహకులు బంద్లో పాల్గొంటారని తెలిపారు. మే 4 మంగళవారం నుంచి మే 11వ తేదీ వరకు అన్ని దుకాణాలు ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలని కోరారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలు సహకరించాలని, కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు.
వేమనపల్లి, మే 3 : వేమనపల్లి మండల కేంద్రంలో నేటి నుంచి స్వచ్ఛంద లాక్డౌన్ విధిస్తున్నట్లు సర్పంచ్ కుబిడె మధుకర్ తెలిపారు. సోమవారం వ్యాపారులు, కార్యదర్శితో సమావేశం నిర్వహించారు. సర్పంచ్ మాట్లాడుతూ నేటి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు లాక్డౌన్ కొనసాగుతుందని తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు నిత్యావసరాల కోసం మినహాయింపు ఉంటుందని తెలిపారు. వారసంతను తాత్కాలికంగా బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో కార్యదర్శి ప్రవీణ్, వ్యాపారులు పాల్గొన్నారు.
రామకృష్ణాపూర్, మే 3 : రామకృష్ణాపూర్ పట్టణంలో కరోనా తీవ్రంగా వ్యాపిస్తూ ప్రజలు, వ్యాపారులను తీవ్ర అనారోగ్యానికి గురి చేస్తున్న తరుణంలో పట్టణంలో పరిమిత గంటల పాటు స్వచ్ఛంద బంద్ పాటించాలని వర్తక సంఘం తీర్మానించినట్లు అధ్యక్షుడు ఆడెపు కృష్ణకుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మే 4వ తేదీ మంగళవారం నుంచి 9వ తేదీ ఆదివారం వరకు ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే షాపులు తెరిచి ఉంటాయని తెలిపారు. ఇందుకు పట్టణ ప్రజలు సహకరించాలని వర్తక సంఘం ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనివాస్, కోశాధికారి ఆడెపు తిరుపతి, ఉపాధ్యక్షుడు యెనగందుల సత్యనారాయణ, గుండా రమేశ్, సహాయ కార్యదర్శి కొండ కుమార్ సంయుక్తంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.