ముంబై: పట్టపగలు అందరూ చూస్తుండగానే ఒక న్యాయవాదిపై కొందరు వ్యక్తులు కత్తులు, ఇనుప రాడ్లతో దాడి చేశారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఆదివారం ఈ ఘటన జరిగింది. దాహిసర్ ప్రాంతానికి కారులో వచ్చిన న్యాయవాదిపై సుమారు 15 మంది దాడి చేశారు. కొందరు వాహనాల్లో దాచిన కత్తులు, ఇనుప రాడ్లు తీసుకుని స్వైర విహారం చేశారు. న్యాయవాదిని కాపాడేందుకు ప్రయత్నించిన వారిపైనా ఆ వ్యక్తులు దాడికి యత్నించారు. ఈ దాడి నుంచి న్యాయవాది తప్పించుకున్నప్పటికీ తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఎంహెచ్బీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఆస్తి గొడవ వల్ల న్యాయవాదిపై కొందరు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. దాడి చేసిన వారిపై అల్లర్లు, హత్యాయత్నం కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.