పట్నా : బిహార్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. యువతి (18)కి పెండ్లి నిశ్చయం కావడంతో రెండేండ్ల కిందట ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఐదుగురు నిందితుల్లో ఒకరు లైంగిక దాడి వీడియోను ఇంటర్నెట్లో అప్లోడ్ చేశాడు. లైంగిక దాడి ఘటనలో బాధితురాలు ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను అభిషేక్ శర్మ, నితీష్ దూబే, దిపు దూబే, లాల్జీ శర్మ, లాలూ ఠాకూర్గా గుర్తించారు. లాలూ, లాల్జీలు ప్రస్తుతం మిడిల్ ఈస్ట్లో ఉద్యోగాలు చేస్తున్నారు.
బాలిక 16ఏండ్ల వయసులో ఉండగా అభిషేక్తో చనువుగా ఉండేది. ఆ సమయంలో వారిని చూసిన నలుగురు నిందితులు ఆమెపై లైంగిక దాడికి పాల్పడి ఆ ఘటనను వీడియోలో రికార్డు చేశారు. బాలిక తనపై జరిగిన సామూహిక లైంగిక దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఇక బాలికకు వేరే వ్యక్తితో నిశ్చితార్ధం కాగా అభిషేక్ తనతోనే పెండ్లికి సిద్ధం కావాలని ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చాడు.
అందుకు ఆమె నిరాకరించడంతో పెండ్లిని ఆపేందుకు బాలికపై జరిగిన లైంగిక దాడి వీడియోను ఇంటర్నెట్లో అప్లోడ్ చేశాడు. దీనిపై బాలిక కతేయ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో విదేశాల్లో ఉంటున్న ఇద్దరు సహా ఐదుగురు నిందితులపై కేసు నమోదు చేశారు. విదేశాల్లో ఉన్న ఇద్దరు నిందితులను రప్పించేందుకు కేంద్ర హోం శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను సంప్రదిస్తున్నామని పోలీసులు తెలిపారు.