పాట్నా: పెద్ద రైలు ప్రమాదం తప్పింది. ఒక రైలు బోగి చక్రం ఊడిపోయింది. అయితే ఎవరికీ ఏమీ కాకపోవడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. బీహార్లోని చంపారన్ జిల్లాలోని ఒక రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం ఈ ఘటన జరిగింది. నార్కటిగంజ్-రక్సౌల్ (05210) ప్యాసింజర్ రైలు, కుమార్బాగ్ స్టేషన్ సమీపంలో పట్టాలు మారుతుండగా ఒక కంపార్ట్మెంట్కు చెందిన రైలు చక్రం ఊడింది. ఈ విషయాన్ని గ్రహించిన లోకో పైలట్ వెంటనే రైలును నిలిపివేశాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం తెలుసుకున్న రైల్వే అధికారులు, పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. ప్రయాణికులు ఎవరూ గాయపడలేదని, ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని సమస్తిపూర్ రైల్వే డివిజన్ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు.