కారేపల్లి రూరల్, జూలై 8: పల్లెప్రగతి వచ్చాక గ్రామాలు బాగుపడుతున్నాయని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ అన్నారు. పల్లెప్రగతిలో భాగంగా మండలంలోని పాతకమలాపురంలో గురువారం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. హరితహారం మొక్కను నాటారు. అనంతరం గ్రామసభలో మాట్లాడుతూ పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామీణ చైతన్యాన్ని ముందుకు నడిపిస్తున్న స్ఫూర్తిదాతగా ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రలో నిలుస్తారని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా సమీక్షిస్తున్నందున స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. ప్రజలు కూడా వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని పిలుపునిచ్చారు. బాలుతండా – బోటితండా వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఖమ్మం నుంచి కమలాపురానికి బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. విద్యుత్ సమస్యలూ పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శకుంతల, జడ్పీటీసీ జగన్, వైస్ ఎంపీపీ శ్రీనివాసరావు, సొసైటీ చైర్మన్ శ్రీనివాసరావు, తహసీల్దార్ పుల్లయ్య, ఎంపీడీవో రమాదేవి, పీఆర్ డీఈ వెంకటరెడ్డి, సర్పంచ్ పద్మ, ఎంపీటీసీ పాండ్యానాయక్, టీఆర్ఎస్ నాయకులు నాగేశ్వరరావు, తిరుపతిరావు, ఐలయ్య, వీరన్న, ఉమాశంకర్, అనీఫ్ తదితరులు పాల్గొన్నారు.