హైదరాబాదీ అమ్మాయి అమ్రిన్ ఖురేషి ప్రస్తుతం రెండు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. తెలుగులో విజయవంతమైన ‘జులాయి’ ‘సినిమా చూపిస్త మావ’ చిత్రాల హిందీ రీమేక్లలో అమ్రిన్ ఖురేషి కథానాయికగా నటిస్తోంది. ‘సినిమా చూపిస్త మావ’ చిత్రాన్ని ‘బ్యాడ్బాయ్’ పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి రాజ్కుమార్ సంతోషి దర్శకత్వం వహిస్తున్నారు. ఆదివారం అమ్రిన్ ఖురేషి జన్మదినోత్సవాన్ని జరుపుకుంది. ఆమె మాట్లాడుతూ ‘కథానాయికగా నా తొలి పుట్టినరోజు ఇది కాబట్టి ఎంతో ప్రత్యేకంగా భావిస్తున్నా. ఇటీవలే హైదాబాద్లో వేసిన సెట్లో ‘బ్యాడ్బాయ్’ పాట చిత్రీకరణ చేశాం. దాదాపు షూటింగ్ మొత్తం పూర్తయింది. త్వరలో ‘జులాయి’ రీమేక్ ప్రారంభమవుతుంది. ఓ హైదరాబాద్ అమ్మాయిగా బాలీవుడ్లో బిజీకావడం చాలా ఆనందంగా ఉంది. దక్షిణాది నుంచి కూడా మంచి ఆఫర్లొస్తున్నాయి. త్వరలో వాటి వివరాలు తెలియజేస్తా’ అని చెప్పింది.