చండీఘఢ్ : వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీతో పొత్తు ఉండదని శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ స్పష్టం చేశారు. పంజాబ్ తో పాటు దేశ రైతులకు హాని తలపెట్టిన బీజేపీతో మరోసారి కలిసి పోటీ చేసే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. కాంగ్రెస్, బీజేపీ, ఆప్ తో కాకుండా ఇతర పార్టీలతో కలిసి పొత్తుతో ముందుకు వెళ్లేందుకు తాము సిద్ధమని స్పష్టం చేశారు. ఇక కెప్టెన్ అమరీందర్ సింగ్ సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తోందని మండిపడ్డారు.
అమరీందర్ సింగ్, నవజోత్ సింగ్ సిద్ధూల మధ్య నెలకొన్న విభేదాలతో లాభపడాలని ఎస్ఏడీ ఉవ్విళ్లూరడం లేదని చెప్పారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి నూతన కూటమి ఏర్పాటు కావచ్చని బాదల్ సంకేతాలు పంపారు. కొవిడ్-19 మహమ్మారి వెంటాడుతూ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే సీఎం అమరీందర్ సింగ్ ఇంటి నుంచి కాలు బయటపెట్టడం లేదని ఆరోపించారు. సింగ్ తన కార్యాలయానికి కూడా హాజరు కావడం లేదని ఆయనను సీఎం అని ఎలా పిలుస్తారని ప్రశ్నించారు. పంజాబ్ లో పాలక కాంగ్రెస్ సర్కార్ ప్రజల విశ్వాసం కోల్పోయిందని బాదల్ పేర్కొన్నారు.