సిద్దిపేట జూన్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేట జిల్లా ప్రగతి ముఖ్యమంత్రి కేసీఆర్ చలవేనని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కావాలంటూ సీఎం కేసీఆర్ 1983లో తన చేతులతోనే అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు దరఖాస్తు ఇచ్చారని గుర్తుచేశారు. ఈ రోజున తానే జిల్లా ఏర్పాటు చేయడమేకాకుండా అత్యద్భుతమైన జిల్లా కార్యాలయ భవన సముదాయాన్ని ప్రారంభించడం ఒక అరుదైన ఘనత అని కొనియాడారు. నూతన కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటును స్వప్నించి ఎన్నో త్యాగాలు, ఎన్నో పోరాటాలతో ఆనాటి ప్రభుత్వాలు ప్రతిపక్షాలు అభాండాలు వేసినా సూటి పోటి మాటలన్నా, ఎన్నో తిట్లు తిని ఓపికతో ఉండి నిగ్రహంతో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడంతో పాటు, బంగారు తెలంగాణ వైపు నడిపించిన ఘనత మన సీఎం కేసీఆర్దేనని పేర్కొన్నారు. ‘సిద్దిపేట జిల్లా ఒకనాడు కరువు కాటకాలతో తండ్లాడింది. 500 ఫీట్లు లోతుకు బోర్లు వేసినా చుక్కనీరు రాని ప్రాంతం. తాగునీటి కోసమే గోసపడ్డ జిల్లా. కాని నేడు స్వరాష్ట్రంలో సిద్దిపేట జిల్లాలో యాసంగిలో 5.30 లక్షల టన్నుల ధాన్యం పండించి రాష్ట్రంలో 5వ స్థానంలో నిలిచింది. నేడు జిల్లా అద్భుతమైన ప్రగతి సాధించిదంటే ఈ ఘనత సీఎం కేసీఆర్దే. తెలంగాణ రావడం కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఈ జిల్లా ప్రజల అదృష్టం. కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడం మా అందరి అదృష్టం. ఈ అరుదైనటువంటి సన్నివేశంలో భాగస్వామి అయినందుకు గర్వంగా ఉన్నది’ అని హరీశ్రావు అన్నారు.