షిమ్లా : హిమాచల్ప్రదేశ్ చంబా జిల్లాలో బుధవారం ఘోర దుర్ఘటన జరిగింది. తీసా సబ్ డివిజన్ వద్ద ప్రైవేటు బస్సు లోయలో పడిపోయిన ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా.. మరో ఏడుగురు గాయపడ్డారు. బస్సు చంబాకు వస్తుండగా.. చంబా-ఖజ్జియార్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో 16 మంది ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని చంబా హాస్పిటల్కు తరలించారు. సంఘటనా స్థలంలోనే ఆరుగురు మరణించగా.. మరో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు. మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు అదుపు తప్పి లోయలో పడిందని పోలీసులు పేర్కొన్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంపై శాసనసభ డిప్యూటీ స్పీకర్, చురా ఎమ్మెల్యే హన్స్రాజ్ సహా ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబానికి రూ.4లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. అలాగే గాయపడ్డ వారికి కూడా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.