పుల్కల్ రూరల్ / చౌటాకూర్ : అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ అయిన సంఘటన బుధవారం చౌటాకూర్ మండల పరిధిలోని జాతీయ రహదారి అయిన శివంపేట్ కమాన్ వద్ద చోటు చేసుకుంది.
జోగిపేట సీఐ శ్రీనివాస్ తెలిపిన కథనం ప్రకారం ఉదయం 8 గంటల సమయంలో హైవే పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు అనుమానంగా కనిపించిన ముగ్గురు వ్యక్తులను శివంపేట్ కమాను వద్ద అదుపులోకి తీసుకున్నారన్నారు. అనుమానాస్పదంగా కనిపిస్తున్న వారి వద్ద ఉన్న బ్యాగులలో తనిఖీ చేయగా సుమారు 70 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకునని పుల్కల్ పోలీస్ స్టేషన్కు తరలించామన్నారు.
ఈ సందర్భంగా సీఐ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ లాక్డౌన్ అమలులో భాగంగా ప్రతిరోజు జోగిపేట నుంచి ఇటు శివ్వంపేట వరకు హైవే పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే బుధవారం చౌటాకూర్ మండలం శివంపేట కమాన్ వద్ద అనుమానాస్పదంగా బ్యాగులతో వెళ్లున్న నలుగురు వ్యక్తులను గుర్తించి పోలీసులు వారిని ఆపి చెక్ చేయగా గంజాయి గుట్టు రట్టైందని తెలిపారు. నిందితులు మహారాష్ట్రకు చెందిన ధన్ సింగ్, ప్రశాంత్, జానూ నారాయన్ సింగ్ అనే ముగ్గురు వ్యక్తులు నల్గొండ నుంచి మహారాష్ట్రలోని నాసిక్కు ఈ గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. పారిపోయిన ఫెరోజ్ వ్యక్తితో పాటు ఈ ముగ్గురిపై కూడా నార్కోటిక్ డ్రగ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు.
అలాగే ఎవరైనా ఇలాంటి చట్టవ్యతిరేకమైన చర్యలకు పాల్పడినా, గంజాయి తరలించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్న హై వే పెట్రోలింగ్ పోలీసులను సీఐ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎస్ఐ నాగలక్ష్మి, ఏఎస్ఐ మల్లేశ్వర్, పోలీసులు ఉన్నారు.