లక్నో: మృతదేహాలపై కప్పిన బట్టలను శ్మశానవాటికలు, దహనవాటికల నుంచి దొంగిలిస్తున్న ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని భాగ్పాట్లో ఈ ఘటన జరిగింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో అధిక సంఖ్యలో ప్రజలు చనిపోతున్నట్లు వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న తరుణంలో ఇది వెలుగులోకి రావడం కలకలం రేపింది.
చనిపోయిన వారి మృతదేహాలపై కప్పిన దుస్తులను శ్మశానవాటికలు, దహనవాటికల నుంచి దొంగిలిస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు భాగ్పాట్ సర్కిల్ పోలీస్ అధికారి అలోక్ సింగ్ ఆదివారం తెలిపారు. 520 బెడ్షీట్లు, 127 కుర్తాలు, 52 తెల్ల చీరలతోపాటు ఇతర దుస్తులు, వస్తువులను వారి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
వీటిని ఉతికి, ఇస్త్రీ చేసి గ్వాలియర్ కంపెనీ లేబుల్తో మార్కెట్లో అమ్ముతారని అలోక్ సింగ్ వివరించారు. స్థానిక వస్త్ర వ్యాపారులతో వీరికి సంబంధం ఉన్నదని, శ్మశానవాటికల నుంచి దుస్తులను సేకరించేందుకు రోజుకు రూ.300 చొప్పున చెల్లిస్తారని వెల్లడించారు. ఈ ముఠాలోని ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారని, గత పదేండ్లుగా వీరు ఈ పని చేస్తున్నట్లు తెలిపారు. దొంగతనంతోపాటు కరోనా చట్టం కింద వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.