ఆదిలాబాద్, ఏప్రిల్ 29 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి): మహారాష్ట్రలోని తిప్పేశ్వర అభయారణ్యంలో వేటగాళ్లు గర్భంతో ఉన్న పులులను లక్ష్యంగా ఎంచుకున్నారు. ఇటీవల యావత్మల్ జిల్లా పాండ్రకవడ తాలుకా ఝరి, జామ్ని గ్రామాల్లో గర్భంతో ఉన్న రెండు పులులను వేటాడి కాల్చి చంపారు. అటవీ ప్రాంతాల్లోని వంతెనల కింద విశ్రాంతి తీసుకునేందుకు వస్తాయని గుర్తించిన వేటగాళ్లు ఆ ప్రాంతాల్లో ఇనుప ఉచ్చును బిగిస్తున్నారు. ఉచ్చులో పదునైన కత్తులు ఉంచుతుండటంతో బయటపడేందుకు ప్రయత్నిస్తున్న పులులు గాయాలతో చనిపోతున్నాయి. అనంతరం వాటి గోళ్లను నరికి, కళేబరాన్ని కాల్చివేస్తున్నారు. తిప్పేశ్వర అభయారణ్యం పొరుగునే ఉండటంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వు అటవీ ప్రాంతంలోకి పులులు ప్రవేశిస్తుంటాయి. దీంతో ఆ వేటగాళ్లు కవ్వాల్తోపాటు మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలోని తడోబా, అంధేరి టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతాల్లోనూ ఇలాంటి ఘాతుకాలకు పాల్పడే ప్రమాదం ఉన్నదని అటవీశాఖ అధికారులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.