భోపాల్: నెల రోజుల కిందట అదృశ్యమైన ఐదుగురి మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. మధ్యప్రదేశ్లోని దేవాస్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. దేవాస్కు చెందిన 45 ఏండ్ల మమత, ఆమె ఇద్దరు కుమార్తెలైన 21 ఏండ్ల రూపాలీ, 14 ఏండ్ల దివ్య, సోదర వరుసమ్యే మరో ఇద్దరు మే 13 నుంచి అదృశ్యమయ్యారు. దీంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా రూపాలీతో ఇంటి యజమాని సురేంద్ర చౌహాన్కు సంబంధమున్నది. అతడు మరో మహిళను పెండ్లి చేసేకునేందుకు సిద్ధం కాగా సురేంద్ర తనని పెండ్లి చేసుకోనున్నట్లు అతడితో కలిసి ఉన్న ఫొటోను రూపాలి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనిపై ఆగ్రహం చెందిన సురేంద్ర ఆమెతోపాటు తమ విషయం తెలిసిన ఆమె కుటుంబ సభ్యుల అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించాడు.
ఈ ఐదుగురిని గొంతునులిమి హత్య చేసిన సురేంద్ర తన 12 మంది అనుచరుల సహాయంతో 8-10 అడుగుల లోతు గొయ్యి తీయించి వారి మృతదేహాలను పూడ్చిపెట్టించాడు. పోలీసులను తప్పుదారి పట్టించేందుకు తాను మరో వ్యక్తిని పెండ్లి చేసుకున్నానని, తన కుటుంబ సభ్యులు తనతో ఉన్నట్లు రూపాలీ పేరుతో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. పోలీసులు దీనిపై ఆరా తీయడంతోపాటు సురేంద్ర కాల్ డేటా పరిశీలించగా అసలు గుట్టు రట్టయ్యింది. కాల్ డేటా ఆధారంగా మే 13న సురేంద్ర మాట్లాడిన అతడి ఐదుగురు అనుచరులను గుర్తించి వారిని ప్రశ్నించడంతో హత్యల విషయం బయపడింది. దీంతో గోతిని తవ్వించి అందులో పూడ్చిన శిథిలమైన ఐదుగురి మృతదేహాలను పోలీసులు వెలికితీయించారు. సురేంద్రతోపాటు ఐదుగురిని అరెస్ట్ చేశారు. సహకరించిన మరి కొందరు నిందితుల కోసం గాలిస్తున్నారు.