భోపాల్: ఒక మహిళ పెండ్లి పేరుతో ఐదుగురు వ్యక్తులను మోసగించింది. చివరకు ఆమెతోపాటు ఇద్దరు కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్లోని భోపాల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. హార్దా జిల్లాకు చెందిన వరుడు, అతడి బంధువులు గురువారం వివాహం కోసం కోలార్ రోడ్డులోని పెండ్లి వేదికకు చేరుకున్నారు. అయితే అక్కడి ఫంక్షన్ హాల్కు తాళం వేసి ఉన్నది. వధువు, ఆమె కుటుంబ సభ్యుల మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్లో ఉన్నాయి. దీంతో మోసపోయినట్లు గ్రహించిన వారు ఫిర్యాదు చేసేందుకు కోలార్ రోడ్ పోలీస్ స్టేషన్కు వచ్చారు. అయితే అక్కడ తమ మాదిరిగా ఆ మహిళ వల్ల పెండ్లి పేరుతో మోసపోయిన నలుగురు పెండ్లి కుమారులు ఉండటం చూసి షాక్ అయ్యారు. మరోవైపు ఈ ఐదుగురి కుటుంబాల ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. చివరకు ఆ మహిళతోపాటు ఆమె కుటుంబానికి చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు.
ఈ ముగ్గురు ముఠాగా ఏర్పడి పెండ్లి పేరుతో పలువురిని మోసగించినట్లు పోలీస్ అధికారి భుపేంద్ర సింగ్ తెలిపారు. పెండ్లి కుమార్తెలు లభించడం కష్టంగా ఉన్న ప్రాంతాల్లోని పెండ్లి కుమారులను వారు లక్ష్యంగా చేసుకుంటారని చెప్పారు. తమను సంప్రదించిన వారిని భోపాల్కు రప్పిస్తారని, వరుడికి ఆ మహిళను వధువుగా చూపి నచ్చితే సంబంధం కుదిర్చినందుకు రూ.20,000 తీసుకుంటారని వివరించారు. అనంతరం పెండ్లి మాటలు కుదిరిన తర్వాత వివాహం రోజున ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి మోసగిస్తారని ఆ పోలీస్ అధికారి వెల్లడించారు.