లక్నో: ఒక జర్నలిస్ట్ను ఐదుగురు తుపాకీతో బెదిరించి డబ్బులు దోచుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఒక టీవీ చానల్కు చెందిన ఎడిటర్ ఇన్ చీఫ్ అతుల్ అగర్వాల్ ఈ నెల 19న రాత్రి ఒంటి గంటకు కారులో ఇంటికి వెళ్తున్నారు. మ్యూజిక్ సిస్టమ్ ఆగిపోవడంతో రైజ్ పోలీస్ స్టేషన్కు సుమారు 300 మీటర్ల దూరంలో నోయిడా ఎక్స్టెన్షన్ వద్ద కారును నిలిపారు. ఇంతలో రెండు బైకులపై ఐదుగురు అక్కడకు వచ్చారు. ఒక బైక్ను కారుకు అడ్డంగా పెట్టారు. మరో బైక్పై ఉన్న వ్యక్తులు కారు డోర్ను బలవంతంగా తెరిచేందుకు ప్రయత్నించారు. లాక్ చేసి ఉండటంతో తుపాకీ తీసి డోర్ తీయాలని బెదిరించారు. మరో దారి లేక ఆయన కారు డోర్ తెరిచారు.
ఆయన కాలర్ పట్టుకుని కారు నుంచి దింపి తుపాకీ గురిపెట్టారు. ఆయన వద్ద ఉన్నవన్నీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన వద్ద ఉన్న సుమారు ఆరేడు వేలు అతుల్ ఇచ్చారు. అలర్జీ వల్ల గోల్డ్ చైన్, ఉంగరం ధరించనని చెప్పారు. తనకు చిన్న కుమారుడు ఉన్నాడని, వదిలేయాలంటూ వారిని ప్రాధేయపడ్డారు. ఓవర్ స్మార్ట్గా వ్యవహరించవద్దని హెచ్చరించిన వారు తన మొబైల్ ఫోన్ను కారు సీటులో పడేసి వెళ్లిపోయారన్నారు. తనకు జరిగిన చేదు అనుభవాన్ని ఫేస్బుక్లో అతుల్ పోస్ట్ చేశారు. దీనిపై నోయిడా పోలీసులు స్పందించారు. బాధిత జర్నలిస్ట్ నుంచి తమకు ఎలాంటి రాత పూర్వక ఫిర్యాదు అందలేదని చెప్పారు. సోషల్ మీడియా ద్వారా అందిన ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటున్నామని, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ టీమ్స్ను రంగంలోకి దించినట్లు వెల్లడించారు.