ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబై కండివాలి ప్రాంతంలోని హిరానందాని హెరిటేజ్ హౌసింగ్ సొసైటీ నివాసితులను నకిలీ వ్యాక్సినేషన్ డ్రైవ్ పేరుతో మోసగించిన కేసులో నలుగురిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. టీకా శిబిరాలను నిర్వహించే మహేంద్ర సింగ్ (39), ధృవపత్రాల కోసం నకిలీ డేటా సేకరించే చందన్ సింగ్, నితిన్ మోండేతోపాటు టీకా క్యాంపుల్లో పాల్గొనే సంజయ్ గుప్తా అరెస్టైన వారిలో ఉన్నట్లు తెలిపారు. సొసైటీకి చెందిన సుమారు 400 మందికి ఇచ్చిన వ్యాక్సిన్లు అధికారికంగా కొనుగోలు చేయలేదని గుర్తించామన్నారు.
హౌసింగ్ సొసైటీ సభ్యులకు మే 30న నిర్వహించిన కరోనా టీకా డ్రైవ్నకు సంబంధించి నిర్వాహకులు బీఎంసీ నుంచి ఎలాంటి అనుమతి పొందలేదని ఏపీసీ (నార్త్) దిలీప్ సావంత్ తెలిపారు. నిందితులు నకిలీ ధృవీకరణ పత్రాలను రూపొందించడానికి ప్రైవేట్ ఆసుపత్రుల కోవిన్ ఐడీలు దొంగిలించారని అన్నారు. ఈ బృందం ఇప్పటి వరకు తొమ్మిది శిబిరాలను నిర్వహించిందని చెప్పారు. బీఎంసీ సహాయంతో టీకా ప్రామాణికతను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.