ఎదులాపురం : ఆదిలాబాద్ జిల్లాలో నెలరోజుల పాటు 30 పోలీస్ యాక్ట్ అమలు ఉంటుందని జిల్లా ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. గురువారం జిల్లా పోలీస్ ముఖ్య కార్యాలయం నుంచి ఆయన మాట్లాడారు. ప్రజల శాంతికి భంగం కలుగకుండా, జిల్లాలో ప్రశాంత వాతావరణం కొనసాగించడానికి అక్టోబర్ 1 నుంచి 31వ తేదీ వరకు నెలరోజుల పాటు పోలీస్ యాక్ట్ నిబంధనలను అమలు చేస్తు ఉత్తర్వులు జారీ చేశామన్నారు. ప్రజా సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, ఊరేగింపులు, బహిరంగ సభలు, ప్రజలు గుమికూడే కార్యక్రమాలను చేపట్టాలంటే ముందస్తుగా డీఎస్పీ లేదా అపై అధికారుల నుంచి అనుమతి పొందాల్సి ఉంటుందన్నారు.
నెల రోజుల పాటు నిషేధిత ఆయుధాలు, కత్తులు , కర్రలు, జెండా కర్రలు, దుడ్డు కరలు, తుపాకులు, పేలుడు పదార్ధాలు, దురుద్ధేశంతో నేరాలకు ఉసిగొల్పే ఎటువంటి ఆయుధాలు, సామగ్రీ కలిగి ఉండొద్దని పేర్కొన్నారు. జనజీవాననికి ఇబ్బంది చిరాకు కలిగించేందుకు దారితీసే ఇబ్బందికర ప్రజా సమావేశాలు, జనసమూహం లాంటివి పూర్తిగా నిషేదంఅన్నారు. ఎవరైనా ఉల్లంఘిస్తే 30 పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం శిక్షకు అర్హులవుతారని వెల్లడించారు. శాంతి పూర్వకంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నా ముందస్తుగా అన్ని వివరాలు వెల్లడించి అనుమతులు కోసం దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
పోలీస్ స్పెషల్ బ్రాంచ్ నిఘా అధికారులు ,టాన్స్ ఫోర్స్ అధికారుల బృందం సభ్యులు ప్రతి మండల కేంద్రాలలో నిఘా కొనసాగిస్తూ ఆకస్మిక దాడులు చేపట్టి , అక్రమార్కులపై గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.