న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: దేశంలో కరోనా విలయం కొనసాగుతున్నది. వైరస్ ఉద్ధృతితో రోజూవారీ మరణాల సంఖ్య తొలిసారిగా 3 వేలు దాటింది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు గడిచిన 24 గంటల్లో దేశంలో కరోనాతో 3,293 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 2,01,187కు చేరింది. వరల్డో మీటర్ గణాంకాల ప్రకారం.. కరోనా మరణాల్లో అమెరికా (5.87 లక్షలు), బ్రెజిల్ (3.95 లక్షలు), మెక్సికో (2.15 లక్షలు) తర్వాత నాలుగో స్థానంలో భారత్ నిలిచింది. ఇదే సమయంలో గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,60,960 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,79,97,267కు చేరింది. ఇప్పటివరకూ 1,48,17,371 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 82.33 శాతానికి పడిపోయింది. 29,78,709 మంది (16.55 శాతం) చికిత్స తీసుకుంటున్నారు. ఈ మేరకు కేంద్రఆరోగ్య శాఖ బుధవారం వివరాలు వెల్లడించింది. ఐసీఎంఆర్ గణాంకాల ప్రకారం.. దేశంలో మంగళవారంనాటికి 28,27,03,789 నమూనాలను పరీక్షించారు.
మహారాష్ట్రలోనే అత్యధికం..
దేశంలోని మొత్తం రెండు లక్షల కరోనా మరణాల్లో సగానికిపైగా మరణాలు నాలుగు రాష్ర్టాల్లోనే నమోదవ్వడం గగుర్పాటును కలిగిస్తున్నది. ఇప్పటివరకూ మహారాష్ట్రలో 66,179 మరణాలు, ఢిల్లీలో 14,807 మంది, కర్ణాటకలో 14,807 మంది, తమిళనాడులో 11,678 మంది మరణించారు. ఇక కొత్తగా నమోదైన 3,293 మరణాల్లో 78.53 శాతం మరణాలు పది రాష్ర్టాలు మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, గుజరాత్, జార్ఖండ్, రాజస్థాన్, పంజాబ్, మధ్యప్రదేశ్లోనే నమోదయ్యాయి. కాగా మొత్తం మరణాల్లో 70 శాతం మంది మృతులు కరోనాతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారేనని కేంద్రప్రభుత్వం తెలిపింది. ఇదిలాఉండగా, కరోనా కట్టడికి మహారాష్ట్రలో విధించిన లాక్డౌన్లాంటి కఠిన ఆంక్షలను మరో 15 రోజులు పొడిగించనున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి రాజేశ్ తోపే తెలిపారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆంక్షలు మంచి ఫలితాలనిస్తున్నాయన్నారు.
గోవాలో నేటి నుంచి లాక్డౌన్
కరోనా ఉద్ధృతి నేపథ్యంలో గోవా ప్రభుత్వం నాలుగు రోజులపాటు లాక్డౌన్ విధించింది. గురువారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు లాక్డౌన్ అమలులో ఉంటుందని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ చెప్పారు. బుధవారం పనాజీలో ఆయన మీడియాతో మాట్లాడారు. అత్యవసర సేవలు, పరిశ్రమలకు లాక్డౌన్ నుంచి మినహాయింపునిచ్చినట్టు చెప్పారు. అయితే ప్రజారవాణాకు అనుమతి లేదని స్పష్టంచేశారు. గోవాలో మంగళవారం 2,110 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని, 31 మంది మృత్యువాతపడ్డారని ప్రభుత్వం వెల్లడించింది.