ఛండీగఢ్: హర్యానాలోని ఓ ఇంట్లో మూడు అస్థిపంజరాలు బయటపడ్డాయి. పానిపట్లోని శివ్నగర్లో ఉన్న ఓ ఇంట్లో మార్పులు చేర్పుల కోసం గ్రౌండ్ ఫ్లోర్లో తవ్వుతున్నారు. ఈ సందర్భంగా అక్కడ ముగ్గురికి చెందిన అస్థిపంజరాలు బయటపడ్డాయి. దీంతో ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాటిని స్వాదీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. ‘ఇంటి ప్రస్తుత యజమాని గత రెండున్నరేండ్లుగా అందులో ఉంటున్నారు. చిన్నచిన్న రిపేర్ల కోసం గ్రౌండ్ ఫ్లోర్లో తవ్వకాలు జరిపారు. దీంతో అందులో మూడు అస్థిపంజరాలు బయటపడ్డాయని డీఎస్పీ సతీష్ తెలిపారు. వారిని ఎప్పుడు చంపారనే విషయం ఫోరెన్సిక్ నివేదికల్లో తెలుస్తుంది. అయితే వారిని హత్య చేసి పూడ్చిపెట్టారని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చామని ఆయన చెప్పారు. ప్రస్తుతానికి హత్య, ఆధారాలను తుడిచిపెట్టడానికి ప్రయత్నించారనే సెక్షన్ల కింద కేసు నమోదుచేశామని, దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.