హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పంచాయతీలు ప్రగతి పథంలో దూసుకెళ్తూ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. ఒకప్పుడు రాష్ట్రంలో గంగదేవిపల్లి ఆదర్శ గ్రామంగా ఉండేదని, కానీ ఇప్పుడు ప్రతి గ్రామం ఒక గంగదేవిపల్లిగా మారిందని చెప్పారు. రాష్ట్రంలోని పల్లెలకు పురస్కారాలు ఇవ్వడంతోపాటు, నిధులు కూడా ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోదీని కోరారు. తెలంగాణ నుంచి 9 పంచాయతీలు, రెండు మండల పరిషత్లు, సంగారెడ్డి జడ్పీకి జాతీయ స్థాయి పురస్కారాలు దక్కాయి. శనివారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో ఈ అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వరంగల్ నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, హైదరాబాద్ నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘనందన్రావు, అవార్డులు వచ్చిన గ్రామ పంచాయతీల సర్పంచ్లు, ఎంపీపీలు, ఎంపీడీవోలు తదితర అధికారులు పాల్గొన్నారు. పురస్కారాలను అందుకున్న అనంతరం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన నూతన పంచాయతీరాజ్ చట్టం, పల్లెప్రగతి కార్యక్రమంతో తెలంగాణలో పంచాయతీల రూపురేఖలు మారిపోయాయని తెలిపారు. తెలంగాణలో పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం అవుతున్నదనేందుకు కేంద్రం నుంచి వస్తున్న అవార్డులు, ప్రశంసలే నిదర్శనమన్నారు. కేంద్రం పురస్కారాలు ఇస్తున్నదని కానీ, నిధులు ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో 8,690గా ఉన్న పంచాయతీలను 12,769కు పెంచి, ప్రతినెలా రూ.308 కోట్లు విడుదల చేస్తున్నట్టు పేర్కొన్నారు. 15వ ఆర్థిక సంఘం స్థానిక సంస్థలకు విడుదల చేసే నిధుల్లో కేంద్రం రూ.699 కోట్లు కోత విధించిందని, అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు ఠంచ్న్గా నిధులు విడుదల చేస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.