మంచిర్యాల : మంచిర్యాల జిల్లా బృందావన్ కాలనీలో ఈ నెల 18న జరిగిన తల్లీకుమార్తెల హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో అత్త విజయలక్ష్మి (47)తోపాటు భార్య రవీనా (23)ను ఆమె భర్త అరుణ్ కుమార్ మరో ఇద్దరితో కలిసి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. గుంటూరు జిల్లా వాసి రోశయ్య, కృష్ణా జిల్లా వాసి సుబ్బారావు సహకారంతో అత్త, భార్యను అరుణ్ హతమార్చాడని పేర్కొన్నారు. హత్యల కోసమే వీరిద్దరిని అరుణ్ ఆన్లైన్లో పరిచయం చేసుకున్నాడు. బంగారం ఇస్తానని ఇద్దరికి ఆశచూపి హత్యకు పురికొల్పినట్లు దర్యాప్తులో గుర్తించామని పోలీసులు వెల్లడించారు. 6 నెలల క్రితమే రవీనాను అరుణ్ కుమార్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. వరకట్నం, కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరిని అంతమొందించాలని పథకం వేశాడని తెలిపారు.