వైద్యుల నిర్లక్ష్యమే కారణమని
కుటుంబ సభ్యుల ఆందోళన
వరంగల్ చౌరస్తా, ఏప్రిల్ 9 : ఎంజీఎం కొవిడ్-19 ట్రయాజ్ విభాగంలో చికిత్స పొందుతూ కేఎంసీ ల్యాబ్ టెక్నీషియన్ సారంగపాణి మృతి చెందాడు. సరైన సమయంలో వైద్యులు స్పందించకపోవడంతోనే సారంగపాణి మృతి చెందాడని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు, కేఎంసీ, ఎంజీఎం ల్యాబ్ టెక్నీషియన్లు ట్రయాజ్ విభాగం ఎదుట ఆందోళన నిర్వహించారు. ట్రయాజ్ విభాగంలో అద్దాలను ధ్వంసం చేశారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగడంతో సారంగపాణి గురువారం సాయంత్రం ఎంజీఎం కరోనా ట్రయాజ్ వార్డులో చేరినట్లు కుటుబ సభ్యులు తెలిపారు. శుక్రవారం ఉదయం టెక్నీషియన్లు నమూనాలు సేకరించి వైరాలజీ ల్యాబ్కు పంపించారు. శుక్రవారం మధ్యాహ్నం సుమారు ఒంటి గంట సమయంలో చికిత్స పొందుతున్న సారంగపాణి మృతి చెందాడని సిబ్బంది కుటుంబ సభ్యులకు తెలిపారు. సరైన సమయంలో వైద్యులు స్పందించి ఉంటే సారంగపాణి మృతి చెందేవాడుకాదని కుటుంబ సభ్యులు, బంధువులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ నాగార్జునరెడ్డి ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడారు. మృతికి గల కారణాలను గుర్తించి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.నమూనాలను పరీక్షించిన వైరాలజీ ల్యాబ్ టెక్నీషియన్లు సారంగపాణి రిపోర్టు నెగటివ్గా అందజేశారు. దీంతో కుటుంబ సభ్యులు మృతదేహాన్ని మట్టెవాడ ప్రాంతంలోని స్వగృహానికి తరలించారు.
ఇవి కూడా చదవండి..
ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
భార్య ప్రేమతో బాక్స్ కట్టిస్తే ఫాస్ట్ఫుడ్ లాగించేందుకు భర్త..