న్యూఢిల్లీ : కొవిడ్-19 సెకండ్ వేవ్ వ్యాప్తితో ప్రజలు భయంతోనే దవాఖానల బాటపడుతున్నారని, వైద్యుల సూచనతోనే ఆస్పత్రుల్లో అడ్మిట్ కావాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కొవిడ్ రోగులు భయంతోనే దవాఖానల పడకల కోసం పరుగెత్తుతున్నారని భయాందోళనకు గురికాకుండా అవసరమైతేనే అడ్మిట్ కావాలని స్పష్టం చేసింది. దేశంలో తగినంతగా ఆక్సిజన్ ఉందని, అయితే దీన్ని దవాఖానాలకు సరఫరా చేయడం, తరలింపు సవాల్ గా మారిందని కేంద్రం పేర్కొంది.
విదేశాల నుంచి ఆక్సిజన్ ట్యాంకర్లను రప్పిస్తున్నామని ప్రజలు ఆందోళనకు గురికావద్దని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. రియల్ టైమ్ ట్రాకింగ్ తో ఆక్సిజన్ ట్యాంకర్ల సరఫరాలను పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. కొవిడ్-19పై పోరులో ఆక్సిజన్, రెమ్డిసివిర్ వంటి ఔషధాలు కీలకమని, వీటిని సమర్ధంగా వాడాలని సూచించారు. భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు ఉల్లంఘిస్తే ఒక వ్యక్తి 30 రోజుల్లో 406 మందికి ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుందని పరిశోధనల్లో వెల్లడైందని కేంద్రం స్పష్టం చేసింది. ఇంటిలో కూడా మాస్క్ ధరించడం శ్రేయస్కరమని పేర్కొంది.